భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారు : 30 శాతం కమిషన్ కోసమే కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు : కేటీఆర్
తెలంగాణాలో భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండపడ్డారు. 22A అవకతవకలపై జ్యూడీషియల్ ఎంక్వయిరీ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతూ అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మూడేళ్లపాటు సెటిల్మెంట్లు చేసుకొని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారని ఆరోపించారు. 30 శాతం కమిషన్లు తీసుకున్న తర్వాత నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతిపై తమ పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. యూనిఫాం అని చెప్పి కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలోనే చట్టం తీసుకువస్తామనడంలో సహితుకత లేదని అభిప్రాయపడ్డారు. 22A భూముల అంశంపై బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ జవాబు చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఇంటిపైకి వేల మంది గుండాలను కాంగ్రెస్ పార్టీ పంపిందని అన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసానికి వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని చెప్పారు. సోమవారం తన సిబ్బందిని పిలిచి వారిపై కాంగ్రెస్ గుండాలతో పోలీస్ స్టేషన్ లోనే దాడి చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు హీనంగా ఉన్నాయని ఆందోళన చెందారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలకు వెళ్తున్నాం అక్కడే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు. 22Aలో తప్పు చేసింది అధికారులు కాదని మంత్రి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తప్పును సారీతో సరిపెట్టారని.. అలా కుదరదన్నారు. 30 శాతం కమిషన్ దోపిడి కోసం ప్రభుత్వం తప్పు చేసిందని ప్రజలకు అర్థమైందని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎదురుదాడి చేయడం కాదు.. ధరణి రక్షణ కవచంలాగా ఉండేదని గుర్తు చేశారు. ఎవరు ఆస్తికి వారేదే బాధ్యత ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు తెలవకుండానే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్పారు. యజమానులకు తెలయకుండానే నిషేధ జాబితాలోకి వారి భూములు వెళ్తున్నాయని తెలిపారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు.. అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని రేవంత్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ భూములను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారని అన్నారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర ప్రయత్నాలతో మమ్మల్ని అసెంబ్లీ నుంచి గెంటేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వానికి సమాధానం చెప్పే సత్తా లేదు. అందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారని అన్నారు. సస్పెండ్ చేసిన నాటి నుంచి తాము ప్రజల మధ్యే ఉన్నామన్నారు. 22Aలో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. ప్రజల యాజమాన్య హక్కుల్ని బంగాళాఖాతంలో వేశారని రేవంత్ సర్కార్పై కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Post a Comment