లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన కాంగ్రెస్
లో క్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ సెక్రెటరీ జనరల్ కి నోటీసులు అందజేసింది. పార్లమెంట్ నిబంధనలలోని రూల్ 94(సి) కింద ఈ అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ తీర్మానానికి 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్లు సమాచారం. లోక్సభలో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యమైన అంశాలపై చర్చ కోరినప్పటికీ స్పీకర్ అనుమతించట్లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగేలా సభ నడుస్తోందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యుల గొంతును అణచివేస్తున్నారని, కీలక బిల్లులను చర్చ లేకుండా ఆమోదింపజేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. స్పీకర్ తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని, కానీ ఆ బాధ్యతను విస్మరిస్తున్నారని ఆరోపించింది. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది.