దుర్గం చెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణలు : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
హై దరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ 329(3), 3(5) సెక్షన్లు, పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు దగ్గర ఐదు ఎకరాలు కబ్జా చేసి ఆక్రమించిన స్థలాన్ని ప్రైవేటు ఆపరేటర్లకు అద్దెకు ఇచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపినట్టు ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా ఆక్రమించిన భూమిని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పార్కింగ్గా వినియోగానికి ఇచ్చినట్లు హైడ్రా గుర్తించింది. 2014లోనే హెచ్ఎమ్డీఏ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నోటిఫికేషన్ ఉన్నప్పటికీ ఆక్రమించినట్లు ఫిర్యాదు వచ్చింది. ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలపై హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.