ఎండల తీవ్రతపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
ఆం ధ్రప్రదేశ్ లో రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను రక్షించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్ధులు, ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఈసారి హీట్ వేవ్ తీవ్రత గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఎండల ప్రభావం తగ్గించేందుకు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ కూడళ్లు వంటి ప్రాంతాల్లో తాత్కాలిక సహాయ...