2050 నాటికి దేశంలో విపత్కర పరిస్థితి : ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు : ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
భా రత దేశంలో క్యాన్సర్ భారాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జీవనశైలిలో మార్పులు, పొగాకు వినియోగం, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. 'గ్లోబోకాన్ - ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2026'లో పలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో సుమారు 14.1 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.16 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగి, 2024 నాటికి సుమారు 16.1 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు అంచనా వేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రతి ఏడాది 28 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. క్యాన్సర్ రకాలలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్ ఎక్కువగా నమోదవుతున్...