తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44పై అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అంబులెన్స్ను వెనుక నుంచి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్కు చెందిన సలేహ భాను (63) అనే మహిళకు హైదరాబాద్లో చికిత్స ముగిసిన అనంతరం, కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకువెళ్తున్నారు. అంబులెన్స్ రామేశ్వర్పల్లి సమీపంలోకి రాగానే, వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంబులెన్స్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు అంబులెన్స్ నుజ్జునుజ్జు కాగా, రోగి సలేహ భానుతో పాటు, అంబులెన్స్ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు. మృతురాలి భర్తకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.
0 Comments