అండమాన్ బేసిన్లో సహజ వాయువు నిల్వలు గుర్తింపు : 'సముద్ర మంతన్' మిషన్లో మరో మైలురాయి
భా రత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్అం డమాన్ సముద్రంలో సహజ వాయువు నిల్వలను గుర్తించింది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దీనిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సముద్ర మంతన్' మిషన్లో భాగంగా మరో మైలురాయిగా అభివర్ణించారు. అండమాన్ దీవులకు తూర్పు తీరంలో సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 355 మీటర్ల లోతులో ఉన్న 'శ్రీ విజయపురం-3' అనే అన్వేషణ బావిలో ఈ సహజ వాయువు లభ్యమైంది. 1,900 మీటర్ల కంటే ఎక్కువ లోతులో చేసిన పరీక్షల ద్వారా గ్యాస్ ఉనికిని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ప్రస్తుతం గ్యాస్ యొక్క నాణ్యత, కూర్పు మరియు మూలాలను తెలుసుకోవడానికి శాంపిల్స్ సేకరించి, ఐసోటోప్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.