సౌదీ అరేబియా పౌర సముదాయాలు, ఆర్థిక కేంద్రాలే లక్షంగా యోమన్ హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడి
సౌదీ అరేబియాలోని పౌర సముదాయాలతో పాటు ఆర్థిక కేంద్రాలే లక్షంగా క్షిపణులు, డ్రోన్లతో యోమన్ హూతీలు విరుచుకపడ్డారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న పలు ఇంధన రంగానికి చెందిన సంస్థలు, కీలక స్థావరాలే టార్గెట్గా దాడులు చేశారు. ఈ దాడుల్లో 73 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. ఈ దాడులు తమ చర్యలేనని హౌతీలు ప్రకటించారు. సౌదీ-యెమెన్ సరిహద్దుకు సమీపంలోని అబ్హా, జిజాన్ ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ చమురు సంస్థ అరామ్కోకు చెందిన సౌకర్యాలతో పాటు అబ్హా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖాలిద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ దాడులపై సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సౌదీ స్పష్టం చేసింది. పౌరులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేయడం తక్షణమే నిలిపివేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.