సంజీవని కార్యక్రమంపైన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రశంసలు : జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం
వి జయవాడలో వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న కేంద్రమంత్రి జేపీ నడ్డా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమంపైన ప్రశంసలు కురిపించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రజలకు ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, నివారణ, మెరుగైన చికిత్సతో పాటు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలోఏర్పాటు చేస్తున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం నుంచి సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు విషయంలో చంద్రబాబు ఆలోచన బాగుందని, ఆయన చేసిన వివిధ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.