సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు :పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు

దేశంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు జరగనుంది. న్యూఢిల్లీలో నిర్వహించే ఈ మెగా సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చే ఈ ముగ్గురు అగ్ర నేతలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2019 అక్టోబర్‌లో తమిళనాడులోని మామల్లపురంలో మోడీతో భేటీ అయిన తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి సైనిక ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన సదస్సులో మోదీ, జిన్‌పింగ్ చర్చలు జరిపి ఉద్రిక్తతలకు ముగింపు పలికారు. తాజాగా ఢిల్లీ సదస్సులో పశ్చిమాసియా పరిస్థితులు ప్రధాన అజెండాగా మారనున్నాయి. "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" అనే థీమ్‌తో ఈసారి సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న పోరు నేపథ్యంలో ఇరాన్, యూఏఈ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. జనవరి 2024లో బ్రిక్స్ కూటమి విస్తరణలో భాగంగా ఈ రెండు దేశాలు సభ్యత్వం పొందాయి. పాలస్తీనా సమస్య, టూ-స్టేట్ సొల్యూషన్‌పై అధికారిక పత్రాల్లో కఠిన పదజాలాన్ని తగ్గించడాన్ని యూఏఈ మినహా మిగిలిన అన్ని దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్, యూఏఈ మధ్య పెరుగుతున్న విభేదాలను తగ్గించేందుకు భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. ప్రధాని మోదీతో జరిపే భేటీలో పశ్చిమాసియా పరిస్థితులను వివరించనున్నారు. మే 2019లో అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసింది. ఈ ఆంక్షల ప్రభావం గత ఏడాది చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై కూడా పడింది. తాజా చర్చలతో రెండు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం కానుందని అంచనా వేస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాల నేతలతో పాటు ఇతర దేశాల ప్రతినిధులను కూడా భారత్ ఆహ్వానించింది. బిమ్స్‌టెక్ ప్రస్తుత చైర్మన్ హోదాలో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత మే నెలలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశం ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. ఈ పరిస్థితుల్లో తాజా బ్రిక్స్ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం