డ్రైవర్ను ప్రత్యేకంగా పలకరించి, కరచాలనం చేసి వెళ్లిన అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను సురక్షితంగా తీసుకువచ్చిన డ్రైవర్ను ప్రత్యేకంగా పలకరించి, కరచాలనం చేసి వెళ్లిన ఆయన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. 18వ బ్రిక్స్ సదస్సు కోసం న్యూఢిల్లీకి వచ్చిన షేక్ ఖలీద్, సదస్సు ముగిసిన అనంతరం విమాన ప్రయాణానికి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు నుంచి దిగిన ఆయన అక్కడ ఉన్న ప్రముఖులకు అభివాదం చేశారు. అనంతరం ముందుకు వెళ్తున్న సమయంలో తన డ్రైవర్ను పలకరించలేదని గుర్తించినట్లుగా కనిపించింది. వెంటనే ఆయన వెనక్కి తిరిగి కారు వద్దకు వెళ్లి డ్రైవర్తో కరచాలనం చేసి, కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాతే అక్కడి నుంచి బయలుదేరారు. అతను భారతదేశానికి చెందిన డ్రైవర్ కావడం విశేషం. కేవలం కొన్ని క్షణాల పాటు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉండే సిబ్బందిని పలకరించడం అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే యువరాజు షేక్ ఖలీద్ స్వయంగా వెనక్కి తిరిగి డ్రైవర్ను పలకరించడంతో ఆయన వినయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పదవి ఎంత ఉన్నతంగా ఉన్నా, తమతో పనిచేసే వ్యక్తులను గౌరవించడం గొప్ప లక్షణమని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Post a Comment