ఇళ్లకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు : కొత్త ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం
దేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2026 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు తక్కువ ధరకు లభించే దేశీయ గ్యాస్ను అదనంగా కేటాయించనున్నారు. దీంతో ఇళ్లకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారనుంది. ప్రభుత్వం నిర్దేశించిన కనీస స్థాయిని మించి కొత్తగా బిల్లు అయ్యే ప్రతి దేశీయ పీఎన్జీ కనెక్షన్కు 200 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల అదనపు ఏపీఎం గ్యాస్ను అర్హత ఉన్న సీజీడీ సంస్థలకు కేటాయించనున్నారు. అయితే కేవలం పైప్లైన్ వేసి మీటర్ ఏర్పాటు చేస్తే ఈ ప్రయోజనం లభించదు. వాస్తవంగా గ్యాస్ వినియోగించి బిల్లు వచ్చే కనెక్షన్ల సంఖ్య పెరిగినప్పుడే కంపెనీలకు ఈ అదనపు గ్యాస్ కేటాయింపు వర్తిస్తుంది. ఈ పథకాన్ని ఆరు నెలల కాలంలో రెండు విడతలుగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని సీజీడీ సంస్థలు తమ అవసరాల్లో కొంత భాగాన్ని ఖరీదైన ఎల్ఎన్జీ ద్వారా భర్తీ చేస్తున్నాయి. కొత్త పథకం కింద లభించే తక్కువ ధర దేశీయ గ్యాస్ను ఎల్ఎన్జీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడం ద్వారా మొత్తం గ్యాస్ సోర్సింగ్ ఖర్చు తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇంటింటికీ పీఎన్జీ కనెక్షన్ అందించేందుకు చేసే మూలధన పెట్టుబడి సాధారణంగా పదేళ్లలో రికవరీ కావాల్సి ఉండగా.. కొత్త పథకం కారణంగా అది మూడేళ్లలోనే రికవరీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. దీంతో మరిన్ని ఇళ్లకు పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. దేశంలో పీఎన్జీ వినియోగం ఇప్పటికే వేగంగా పెరుగుతోంది. ఆగస్టు 18 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. పీఎన్జీఆర్బీ గణాంకాల ప్రకారం 2026 జూలై నాటికి ఈ సంఖ్య 1,75,46,911కు చేరింది. అంటే దేశంలో పీఎన్జీ కనెక్షన్లు ఇప్పటికే 1.75 కోట్ల మార్క్ను దాటాయి. అయితే కనెక్షన్లు ఇవ్వడం మాత్రమే కాకుండా అవి యాక్టివ్గా ఉండి, వాస్తవంగా గ్యాస్ వినియోగించేలా చేయడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పీఎన్జీ ఆర్బీ అనుమతించిన భౌగోళిక ప్రాంతాల్లో సీజీడీ సంస్థలు గ్యాస్ నెట్వర్క్ను విస్తరిస్తున్నాయి. 2025లో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 307 భౌగోళిక ప్రాంతాలకు CGD అభివృద్ధి కోసం అనుమతులు ఉన్నాయి. 2026లో పీఎన్జీ విస్తరణను మరింత వేగవంతం చేసేందుకు 110 ప్రాధాన్య ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతోపాటు, పైప్లైన్ నిర్మాణానికి అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసే చర్యలు కూడా చేపట్టింది. పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మే 2026లో ప్రభుత్వం మరో సౌకర్యాన్ని ప్రకటించింది. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న ఎల్ఫీజీ వినియోగదారులు 30 రోజుల్లో తమ ఎల్ఫీజీ కనెక్షన్ను సరెండర్ చేయవచ్చు. అదే సమయంలో భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతానికి మారాల్సి వస్తే తిరిగి ఎల్ఫీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ తీసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ చర్యలతో పీఎన్జీ వినియోగాన్ని మరింత విస్తరించడంతోపాటు, దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఇంధన మౌలిక వసతులను బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Post a Comment