విదేశాల నుంచి దిగుమతి అయ్యే కొత్త వెర్షన్ హ్యూమనాయిడ్ రోబోలు, రోబో డాగ్స్ మరియు పవర్ ఇన్వర్టర్లపై అమెరికా టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ అయిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పూర్తి స్థాయి నిషేధాన్ని ప్రకటించింది. అత్యంత కీలకమైన అమెరికా సప్లై చైన్ వ్యవస్థను సురక్షితంగా ఉంచడం, కమ్యూనికేషన్ నెట్వర్క్లను సైబర్ దాడుల నుండి కాపాడుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని FCC ఛైర్పర్సన్ బ్రెండన్ కార్ స్పష్టం చేశారు.ఈ నిషేధ ఆంక్షలు పరికరాల యొక్క నూతన (కొత్త) వెర్షన్ దిగుమతులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్లో దాదాపు 85% వాటాతో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనాకు చెందిన 'యూనిట్రీ', 'ఏజీఐబాట్' వంటి సంస్థలు వేల సంఖ్యలో రోబోలను తయారుచేస్తుండగా, అమెరికాకు చెందిన టెస్లా, ఫిగర్ ఏఐ వంటి కంపెనీల ఉత్పత్తి వందల సంఖ్యలోనే ఉంది. ఈ నిషేధం ద్వారా అమెరికా తన స్థానిక డెవలపర్లకు మద్దతుగా నిలుస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్లు, అధునాతన సాంకేతికతల ఎగుమతిపై ఆంక్షలు విధించిన అమెరికా, భవిష్యత్తులో చైనాకు చెందిన ఓపెన్-సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ల వినియోగాన్ని కూడా నిరోధించే దిశగా ఆలోచిస్తోంది. డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు మరియు గృహోపకరణాలలో ఉపయోగించే పవర్ ఇన్వర్టర్ల నూతన దిగుమతులపై కూడా నిషేధం పడింది. వరల్డ్ టెక్నాలజీ రంగంలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది.
0 Comments