ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన' (పీఎం-ఎస్ఎస్వై)కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ.5,070 కోట్లు ఖర్చు చేయనుంది. చెరువులు, సరస్సులు, జలాశయాల ఉపరితలంపై భారీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు, 10,000 మెగావాట్-గంటల సామర్థ్యం గల బ్యాటరీ నిల్వ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టులను 2026- 2027 నుంచి 2030- 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆమోదించబడతాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక సహాయ పంపిణీ 2033 వరకు కొనసాగుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు అంటే భూమిపై కాకుండా, సరస్సు, ఆనకట్ట, జలాశయం లేదా చెరువు ఉపరితలంపై ఏర్పాటు చేయబడిన సౌర విద్యుత్ ప్లాంట్లు. దీనివల్ల భూమి అవసరం తగ్గి, అందుబాటులో ఉన్న నీటి వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. విజయవంతమైన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు ప్రతి మెగావాట్కు రూ.1 కోటి వరకు కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది. దీంతో ప్రాజెత్టు వ్యయం తగ్గి పెట్టుబడిదారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాజెక్ట్ ప్రాథమిక రీసెర్చ్, సర్వే కోసం రూ. 50 లక్షల వరకు సహాయం అందించబడుతుంది. ఇండియా ప్రస్తుత ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యం సుమారు 700 మెగావాట్లుగా ఉంది. కొత్త పథకం దీనిని 5,000 మెగావాట్ల మేర పెంచుతుంది. భూసేకరణ అవసరం తగ్గుతుంది. బ్యాటరీ నిల్వ విద్యుత్ సరఫరాను మరింత స్థిరంగా, నమ్మదగినదిగా చేస్తుంది. జలాశయాలు, చెరువులు మరింత మెరుగ్గా ఉపయోగించబడతాయి. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని ప్రభుత్వ అంచనా. ఇది సౌర ప్రాజెక్టులకు సంబంధించిన రంగాలలో 16,000 నుంచి 17,000 ఉద్యోగాలను కూడా సృష్టించగలదు. అంతేకాకుండా ఇది సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీలు, ఇతర భాగాల దేశీయ తయారీని ప్రోత్సహిస్తుంది.
0 Comments