జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇమ్రాన్ ఖాన్ : అమికస్ క్యూరీ నివేదిక


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన తన కంటిచూపును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. ఇమ్రాన్ జైలు పరిస్థితులపై సుప్రీంకోర్టుకు సమర్పించిన అమికస్ క్యూరీ నివేదిక ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' తన సంపాదకీయంలో తీవ్రంగా విమర్శించింది. కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సల్మాన్ సఫ్దార్, ప్రధాన న్యాయమూర్తి యహ్యా అఫ్రిది నేతృత్వంలోని ధర్మాసనానికి తన నివేదికను సమర్పించారు. గతేడాది అక్టోబర్ 2025 వరకు 6/6గా ఉన్న ఇమ్రాన్ కుడి కంటిచూపు, సరైన వైద్యం అందకపోవడం వల్ల ఇప్పుడు 15 శాతం కంటే తక్కువకు పడిపోయిందని నివేదికలో స్పష్టం చేశారు. కంటి వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని పలుమార్లు కోరినా జైలు సూపరింటెండెంట్ పట్టించుకోలేదని పేర్కొన్నారు.ఈ నివేదికతో పాకిస్థాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు, ఇమ్రాన్‌కు వ్యక్తిగత వైద్యులతో చికిత్స అందించాలని, విదేశాల్లో ఉన్న తన కుమారులతో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 16వ తేదీలోగా తమ ఆదేశాలను అమలు చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. రాజకీయ ఖైదీ పట్ల ప్రభుత్వ తీరును 'క్రిమినల్ నిర్లక్ష్యం'గా అభివర్ణించిన ట్రిబ్యూన్ పత్రిక, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఇదిలా ఉండగా, వైద్య కారణాల దృష్ట్యా తోషాఖానా-II కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేసి, బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ శనివారం ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుడి కంటిలో రక్తం గడ్డకట్టడం వల్ల చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.     

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం