ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్ బస్సు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది సొంతూళ్లకు వెళ్లడానికి ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. కొవ్వూరు- రాజమండ్రి బ్రిడ్జిపైకి చేరిన వెంటనే మంటలబారిన పడింది. సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ దేవకుమార్, సీఐ విశ్వం తెలిపారు. ఇంజిన్, డాష్ బోర్డు నుంచి పొగ వెలువడటంతో ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపిసి, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. సకాలంలో వారందరూ కిందికి దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానకి చేరుకొని మంటలు అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 80 లక్షల రూపాయల మేర నష్టం సంభవించి ఉండొచ్చని అంచనా వేసినట్లు కొవ్వూరు అగ్నిమాపక అధికారి వేణు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి తరలించారు.
0 Comments