Ad Code

మిర్యాలగూడ వద్ద ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ : హైదరాబాద్ కు తరలించిన పోలీసులు

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా ఆయన కోసం వెదుకుతున్న పోలీసులకు ఆయన మిర్యాలగూడ వద్ద ఉన్నట్లుగా సమాచారం రావడంతో అరెస్టు చేసి, హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఆయనపై తోటి మహిళా అధికారిణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను తీవ్రంగా వేధించడమే కాకుండా, శారీరకంగా దాడికి తెగబడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా, ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి, వాటిని ఆమె భర్తకు పంపిస్తానని బెదిరింపులకు గురిచేస్తూ తీవ్రమైన బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ తీవ్రమైన ఆరోపణలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ, పోలీస్ అకాడమీ యాజమాన్యం ఆయనను తక్షణమే శిక్షణ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసు తీవ్రతను బట్టి సై పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత లోని వివిధ కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ముదిరి, అరెస్ట్ భయంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం డ్రామా కూడా ఆడారు. అదే సమయంలో సూసైడ్ నోట్ పేరుతో ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ క్యారెక్టర్ పైనా నిందలేశారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ కావడంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. పరారీ అయినట్లుగా గుర్తించి చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసిన పోలీసులు నిఘా పెట్టి మిర్యాల గూడ వద్ద అరెస్టు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu