తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మెలిసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలి !


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించారు. అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దసరా సమ్మేళనం 2024 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఢంకా మోగించగా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మెలిసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు. రాజకీయాలకీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. దేశంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలని సీఎంలకు సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించామని తెలిపిన బండారు దత్తాత్రేయ.. ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటిచెప్పాలన్నదే దీని లక్ష్యమని తెలిపారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ అలయ్ బలయ్‌లో ప్రదర్శించామని తెలిపారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 'అలయ్ బలయ్' సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్నేహశీలి అయిన బండారు దత్తాత్రేయ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓ చక్కని సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆ సంస్కృతిని కొనసాగించటం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా, సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఒకప్పుడు ఐక్యత లేక పరాయి పాలనలో సమస్యలు అనుభవించామని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు పాశ్చాత్య అనుకరణ కారణంగా కుటుంబానికి, సమాజానికి దూరమౌతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఏకం కావాలన్నారు. ఐక్యంగా ఉండటం అంటే అంతా ఒకే మాట మీద నిలబడటమే కాదు, పక్కవారి ఆలోచనలను, భావాలను గౌరవించటం కూడా అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అలయ్ బలయ్ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. రాజకీయ విభేదాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే, అది కార్యకర్తల వరకూ పాకుతుందని, ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. కాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టగా.. హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది. ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్​ రెడ్డి, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, సినీనటుడు కోట శ్రీనివాసరావు, తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బీబీపాటిల్, సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం