మహిళల ఆసియా కప్ 2026 : సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ పరాజయం : పేలవమైన ఫీల్డింగ్ కొంపముంచిందన్న పాక్ కెప్టెన్

దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఉత్కంఠభరిత సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సెమీఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది. తద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో సెప్టెంబర్ 13న జరగనున్న టైటిల్ పోరులో భారత్‌తో తలపడనుంది. పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. 36 బంతుల్లో 47 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 3.8 ఓవర్లలో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఈ అద్భుత ప్రదర్శనకు ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించినా జట్టును గెలిపించలేకపోయాననే నిరాశ ఆమె స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ మ్యాచ్ చాలా వరకు తమ చేతుల్లోనే ఉండిందని, అయితే చివరి క్షణాల్లో శ్రీలంక మిడిలార్డర్ ఆటను తమ వైపు తిప్పుకుందని అంగీకరించింది. ముఖ్యంగా హర్షిత మాధవి, కవిషా దిల్హారి జోడీ ఒత్తిడిలోనూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఎంతో తెలివిగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను తమ చేజార్చుకునేలా చేశారని వారిని ప్రశంసించింది. తాము నిర్దేశించిన 130 పరుగుల స్కోరును డిఫెండ్ చేసుకునేందుకు తగినదేనని ఫాతిమా సనా స్పష్టం చేసింది.అయితే కీలకమైన చివరి ఓవర్లలో జట్టు చేసి పేలవమైన ఫీల్టింగ్ కారణంగా ప్రత్యర్థికి అనవసరంగా చాలా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చిందని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమని వాపోయింది. ఈ టోర్నమెంట్ ద్వారా తమ జట్టు బ్యాటింగ్‌లో కొంత మెరుగుదల సాధించిందని పాక్ కెప్టెన్ ఫాతిమా సనా సంతృప్తి వ్యక్తం చేసింది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం