బోడుప్పల్ టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం
తె లంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు టిఫిన్ సెంటర్లోని సుమారు రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు సమాచారం. దీంతో మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫుడ్ కోర్టులకు వ్యాపించడంతో అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మూడు ఫుడ్ సెంటర్లకు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాల పై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.