రూ.15 కోసం ప్రొఫెసర్‌పై కత్తితో దాడి !

బీహార్‌లోని ఛాప్రా నగరంలో చిల్లర విషయంలో తలెత్తిన వివాదంలో కేవలం రూ. 15 కోసం ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దుకాణదారుడి కుమారుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్ లాల్ సింగ్ కళాశాలలో ఫిలాసఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భగవాన్ ఠాకూర్, రోజూలాగే స్థానిక దుకాణానికి అర లీటరు పాలు కొనుగోలు చేయడానికి వెళ్లారు. పాలు తీసుకున్న అనంతరం దుకాణదారుడికి రూ. 500 నోటు ఇవ్వగా, సదరు వ్యాపారి రూ. 450 తిరిగి ఇచ్చాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత లెక్క చూసుకోగా, తనకు రావాల్సిన దాంట్లో రూ. 15 తక్కువగా వచ్చినట్లు ప్రొఫెసర్ గుర్తించారు. వెంటనే తిరిగి దుకాణం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని దుకాణదారుడి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి మాటలతో వ్యాపారి ఆ రూ. 15 తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ప్రొఫెసర్ ఆ డబ్బులు తీసుకోబోతుండగా, దుకాణదారుడి కుమారుడు వెనుక నుంచి ఆకస్మికంగా వచ్చి పదునైన కత్తితో ప్రొఫెసర్ చెవిపై బలంగా పొడిచాడు. ఈ దాడితో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన ప్రొఫెసర్ భగవాన్ ఠాకూర్, వెంటనే తన సహోద్యోగికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహోద్యోగి ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం