ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సమ్మిట్-2026
ఢిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సమ్మిట్-2026 జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల అధినేతలు, ఆహ్వానితులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. భారత అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ప్రపంచ పాలన, బహుపాక్షికవాదం, ఆర్థిక సహకారం, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ ప్రపంచ వృద్ధి వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. 2026 జనవరి 1న భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారత అధ్యక్షతకు "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం - సుస్థిరత" అనే థీమ్ను నిర్దేశించారు. బ్రిక్స్ మూడు ప్రధాన సహకార స్తంభాలైన రాజకీయ-భద్రతా సహకారం, ఆర్థిక-ద్రవ్య సహకారం, సాంస్కృతిక-ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై భారత్ దృష్టి పెట్టింది. భారత అధ్యక్షతలో ఇప్పటికే పలు మంత్రివర్గ స్థాయి సమావేశాలు, అధికారిక చర్చలు, నిపుణుల సమావేశాలు నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కుపైగా సమావేశాలు, ఉన్నత స్థాయి సంప్రదింపులు నిర్వహించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రస్తుతం బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. పూర్తి సభ్యత్వంతో పాటు బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీస్ అనే ప్రత్యేక వర్గం కూడా ఉంది. ప్రస్తుత భాగస్వామ్య దేశాల్లో బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం ఉన్నాయి. ఈ దేశాలను అవసరాన్ని బట్టి బ్రిక్స్ సమావేశాలకు ఆహ్వానిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఇతర సమావేశాల్లో కూడా భాగస్వామ్య దేశాలు పాల్గొనే అవకాశం ఉంటుంది.
Comments
Post a Comment