ప్రపంచ జూనియర్ స్వ్కాష్ ఛాంపియన్షిప్లో భారత యువ ప్లేయర్ అనహత్ సింగ్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీ ఫైనల్లో ఈజిప్ట్కు చెందిన బార్బ్ సమేహ్ను నాలుగు గేమ్ల్లో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా ప్లేయర్గా అనహత్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 21 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టింది. అనహత్కు ముందు 2005లో జోత్స్న చిన్నప్ప ఈ ఘనత సాధించింది. టాప్ సీడ్గా బరిలోకి దిగిన అనహత్.. బార్బ్ సమేహ్పై 11-3, 8-11, 11-4, 11-6 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్ను 11-3తో సులువుగా గెలిచిన అనహత్కు రెండో గేమ్లో ఈజిప్ట్ క్రీడాకారిణి గట్టి పోటీ ఇచ్చింది. 11-8తో రెండో గేమ్ను సొంతం చేసుకుని స్కోరును సమం చేసింది. అయితే కీలక సమయంలో అనహత్ తన ప్రతిభను చాటింది. తర్వాతి రెండు గేముల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ 11-4, 11-6తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తన విజయంపై అనహత్ స్పందించింది. 'చాలా సంతోషంగా ఉంది. కొన్ని నెలల క్రితం బ్రిటిష్ జూనియర్ ఓపెన్లో బార్బ్తో ఆడాను. అప్పుడూ మ్యాచ్ చాలా దగ్గరగా సాగింది. అందుకే ఈసారి మరింత మెరుగ్గా ఆడాలని తెలుసు. నాలుగు సార్లు ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో ఓడిపోయాను. ఇప్పుడు ఫైనల్ చేరడం నా తల్లిదండ్రులు, కోచ్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ టోర్నీ ఇంకా ముగియలేదు' అని ఆమె తెలిపింది. ఫైనల్లో ఈజిప్ట్కు చెందిన రెండో సీడ్ ప్లేయర్ రుకయ్యా సలెమ్తో అనహత్ టైటిల్ పోరులో తలపడనుంది.
0 Comments