కర్ణాటకలోని హోస్కోట్లో ఉన్న రివర్ మొబిలిటీ ఉత్పత్తి కేంద్రం నుండి 50,000వ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. ఈ సంస్థ 2023 ఆగస్టు 25న ఇండీ తయారీని ప్రారంభించింది. ఈ మైలురాయిని చేరుకోవడానికి మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయం పట్టిందన్నమాట. ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రివర్ మొబిలిటీకి చెందిన ఏకైక ఉత్పత్తి. అయినప్పటికీ సంస్థ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 2025లో జెన్ 3 వెర్షన్ పరిచయంతో ఈ స్కూటర్ లేటెస్ట్ అప్డేట్ను పొందింది. జెన్ 3 అప్డేట్తో రివర్ కొత్త టైర్లు, అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, మెరుగైన స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా హిల్-హోల్డ్ అసిస్ట్ను కూడా జోడించారు. అయితే వినియోగదారుల అభిప్రాయం మేరకు సంస్థ స్కూటర్ రైడింగ్ డైనమిక్స్ను మెరుగుపరిచినట్లు సమాచారం. ఇండీ ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి దాని ప్రాక్టికాలిటీ. ఇది సీటు కింద 43 లీటర్ల స్టోరేజ్ను, దానికి తోడు 12-లీటర్ల గ్లోవ్ బాక్స్ను అందిస్తుంది. దీంతో ఇది భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఇండీకి 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో పాటు 9 bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఇది 163 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. కాగా ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. కంపెనీ ప్రకారం, 750W ఛార్జర్ను ఉపయోగించి, బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. బ్రేకింగ్ విధులను రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ నిర్వహిస్తాయి.
0 Comments