భూమిపై విద్యుత్ వినియోగం, స్థల సమస్యలను అధిగమించేందుకు అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్
భూమిపై విద్యుత్ వినియోగం, స్థల సమస్యలను అధిగమించడమే ప్రధాన లక్ష్యంగా గూగుల్ అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ 'ప్రాజెక్ట్ సన్క్యాచర్' పేరుతో స్థాపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోని ఇతర టెక్ కంపెనీలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రాజెక్ట్ సన్క్యాచర్ అంటే సూర్యకాంతిని పట్టుకోవడం. ఈ ప్రాజెక్ట్లో భాగంగా భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో అనేక శాటిలైట్లను ఒక సమూహంగా గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఈ శాటిలైట్లు గూగుల్కు చెందిన ప్రత్యేక టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్లతో అనుసంధానించబడి ఉంటాయి. ఈ శాటిలైట్లన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి అవసరమైతే భూమికి కూడా అనుసంధానించబడి, అంతరిక్షంలోనే ఒక ఏఐ డేటా సెంటర్లా పనిచేస్తాయి. అంతరిక్షంలో సూర్యకాంతి చాలా శక్తివంతంగా, దాదాపు నిరంతరం లభిస్తుంది. సరైన కక్ష్యలో ఉంచితే సోలార్ ప్యానెళ్లు భూమిపై కంటే 8 రెట్లు ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు. అంతరిక్షంలో రాత్రి లేదా మేఘాలు ఉండవు కాబట్టి విద్యుత్ సరఫరా నిరంతరం ఉంటుంది కాబట్టి బ్యాటరీల అవసరం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాట్బాట్లు, ఇమేజ్ జనరేటింగ్ టూల్స్, వీడియో ఎడిటింగ్ వంటి ఏఐ సేవలకు కంప్యూటింగ్ శక్తి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాబోయే ఐదేళ్లలో ఏఐ డేటా సెంటర్ సామర్థ్యం 5 రెట్లు పెరగాల్సి ఉంటుంది. ఏఐ డేటా సెంటర్లు అత్యధికంగా విద్యుత్ను వినియోగిస్తాయి. ఈ క్రమంలో 'ప్రాజెక్ట్ సన్క్యాచర్' సక్సెస్ అయితే భూమిపై విద్యుత్ కొరతను తగ్గించడంలో సహాయపడుతుది. గూగుల్ ప్రస్తుతం శాటిలైట్లను తయారుచేసే ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థతో కలిసి పనిచేస్తోంది. 2027 ప్రారంభంలో రెండు నమూనా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. అంతరిక్ష పరిస్థితుల్లో హార్డ్వేర్ పనితీరును పరీక్షించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. సూర్యుడు సౌర వ్యవస్థలోనే అత్యంత శక్తివంతమైన వనరు. సూర్యుడు మానవులు ప్రస్తుతం వినియోగించే మొత్తం విద్యుత్ కంటే 100 ట్రిలియన్ రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాడని గూగుల్ చెబుతోంది. అంతరిక్షంలో ఈ శక్తిని వినియోగించుకోవడం వల్ల భూమిపై స్థలం, నీరు, విద్యుత్ కోసం పడే ఇబ్బందులు తగ్గుతాయి.
Comments
Post a Comment