తమిళనాడులో 4,271 కోట్ల పెట్టుబడితో ఐదు యూనిట్లు ఏర్పాటు !
దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. దీని ద్వారా మేకిన్ ఇండియా ప్రోగ్రాం కి ఊతం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి, ఇతర దేశాల పైన ఆధార పడడాన్ని తగ్గించడానికి, మనదేశంలోని తయారీదారులకు ప్రోత్సాహకాలను అందించడానికి రూపొందించబడిన పథకం. ఈ పథకం ద్వారా దేశీయ తయారీని బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించిన ఈ పథకంలో అనేక యూనిట్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీం కింద దేశంలోని మూడు రాష్ట్రాలలో 5,500 కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఆమోదముద్ర వేసింది. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 5,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా మరికొంతమందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, మొత్తం 36 వేల 559 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు ఈ ప్రాజెక్టుల ద్వారా తయారవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైర్మా స్ట్రాటెజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 765 కోట్ల రూపాయల పెట్టుబడి మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ యూనిట్లో మొత్తం 6933 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 955 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కేనెస్ సర్క్యూట్ లిమిటెడ్ సంస్థ 4 యూనిట్లను, అస్సెంట్ సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు రాష్ట్రంలో 4,271 కోట్ల పెట్టుబడితో 5 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఐదు యూనిట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ఎక్కువ స్థాయిలో తమిళనాడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ ను ఉత్పత్తి చేయడమే కాకుండా, ఏపీ తో పోలిస్తే ఐదింతలు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను కూడా ఇవ్వబోతుంది.
Comments
Post a Comment