మద్యం సేవిస్తే ఎలక్ట్రిక్ బైక్ స్టార్ట్ కాదు !
ఉత్తరప్రదేశ్, అలహాబాద్ లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విద్యార్థులు, సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ క్లబ్తో కలిసి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ బైకును డిజైన్ చేశారు. మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు భోపాల్లో జరిగిన ప్రతిష్టాత్మక పోటీలో భాగంగా అత్యంత భద్రతతో కూడిన ఈ ఎలక్ట్రిక్ బైకును అభివృద్ధి చేశారు. ఈ పోటీలో ఎలక్ట్రిక్ బైకు బెస్ట్ డిజైన్తో ఫ్యూచర్ అవార్డులను గెలుచుకుంది. ఈ బైకును మద్యం సేవించి నడుపుతానంటే స్టార్ట్ కాదు. ఒకవేళ స్టార్ట్ చేసినా ఆటోమాటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే.. ఈ బైక్లో ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్స్. స్మోక్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ముందుగానే ప్రమాదాలను హెచ్చరిస్తాయి. హిల్-అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. తద్వారా ప్రమాద సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను పొందవచ్చు. ఈ వినూత్న ఎలక్ట్రిక్ బైకు గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. అంతేకాదు.. కేవలం 4 గంటల ఛార్జ్తో 60 కిలోమీటర్లు దూసుకుపోగలదు. మెరుగైన భద్రత కోసం ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్లు కాకుండా స్మోక్ సెన్సార్లు, యాంటీ-థెఫ్ట్ అలారాలు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రమాదం జరిగినప్పుడు ఆటోమాటిక్గా సెల్ఫ్ అసిస్ట్ కోసం అత్యవసర సేవలను కూడా సంప్రదించవచ్చు. బైక్లో మంటలు లేదా పొగ వ్యాపించినా వెంటనే స్మోక్ సెన్సార్లు అలర్ట్ చేస్తాయి. ఎవరైనా బైకుని దొంగతనం చేసేందుకు ప్రయత్నించినా కూడా వెంటనే యాంటీ థెఫ్ట్ అలారం మోగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకారం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. డ్రైవర్ తాగి ఉన్నాడని బైక్ సెన్సార్లు గుర్తిస్తే.. ప్రమాదం జరగకుండా నిరోధించడానికి ఇంజిన్ స్టార్ట్ కాదని ఆయన అన్నారు. ఎత్తుగా ఉన్న రోడ్డును సైతం సులభంగా ఎక్కడానికి హిల్-అసిస్ట్ ఫీచర్ను కలిగి ఉందని చెప్పారు. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా అత్యవసర సేవలను అందిస్తుందని ఆయన వివరించారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ దాదాపు రూ.1.30 లక్షల వ్యయంతో ఇటీవల భోపాల్లో ఇంపీరియల్ సొసైటీ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ (ISIE) నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీలో ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 70 జట్ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ.. ఎమ్ఎన్ఎన్ఐటీ రెండు అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ డిజైన్, ఫ్యూచర్ అవార్డులను పొందింది. ఎంఎన్ఎన్ఐటీ టాప్ 10 జట్లలో స్థానం సంపాదించింది. ఎమ్ఎన్ఎన్ఐటీకి ప్రాతినిథ్యం వహించిన మెకానికల్ పుల్కిత్ సింఘాల్, హర్ష మహర్షి, ఆదర్శ్ కుమార్, సుమిత్ మిశ్రా, యశవ్ భారతి, సందీప్ యాదవ్, సూర్యాంశ్ పాఠక్, ప్రశాంత్లతో సహా ఇ-బైక్ను తయారు చేశారు.
Comments
Post a Comment