ఆర్టీసీ ఆపరేషనల్ నష్టాల నుంచి లాభాల దిశగా పయనిస్తోంది : శాసనసభలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
శా సనసభలో ఆర్టీసీపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుదీర్ఘంగా, వివరంగా సమాధానమిస్తూ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా, రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థను నిర్వీర్యం చేసి నష్టాల బాటలోకి నెట్టిందని, అలాగే కార్మికుల సమస్యలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఇది మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఆర్టీసీకి కొత్త జీవం పోసిందని, ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగి బస్ స్టేషన్లలో రద్దీ పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఇప్పటివరకు 347.47 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించి, రూ.12,171 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు. ఆసుపత్రులు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు, పిల్లల చదువుల కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. గత సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల వినతులకు అనుగుణంగా కొత్త సర్వీసులు, అదనపు ట్రిప్పులు ప్రారంభించామని,...