ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ !
హై దరాబాద్ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పంట కొనుగోళ్లపై మాట్లాడుతూ ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని అన్నారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని, వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పంట బోనస్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను భట్టి తిప్పికొట్టారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తాం. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. తడిచిన ధాన్యం కూడా కొంటున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నాం. గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా మేం ధాన్యం కొనుగోలు చేశాం.’ అని భట్టి తెలిపారు.