100 డాలర్లు దాటిన బ్యారెల్ ముడి క్రూడ్ ఆయిల్ ధర
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు దాటింది. జూలై 24 తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. బ్రెంట్ క్రూడ్ 2.05% పెరిగి 100.19 డాలర్లకు పెరగ్గా, అమెరికా డబ్లుటిఐ క్రూడ్ 1.60% పెరిగి 94.52 డాలర్లకు చేరింది. హౌతీల దాడులతో సౌదీ చమురు కేంద్రాల్లో మంటలు చెలరేగడం, రెడ్ సీ, హర్మూజ్ జలమార్గం ద్వారా రవాణా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఆయిల్ సరఫరా నిలిచిపోతే ధరలు మరింత పెరుగుతాయని క్యాపిటల్ ఎకనామిక్స్ నిపుణుడు హమద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 4.3 మిలియన్ బారెళ్లు తగ్గవచ్చని ఐఇఎ వెల్లడించింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత 3 నెలలుగా స్థిరంగా ఉండగా, తాజా పెరుగుదలతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు నష్టపోతున్నాయి. ఇక్రా వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇంధన విక్రయ సంస్థలకు మార్కెటింగ్ మార్జిన్లు పెట్రోల్పై మైనస్ రూ. 5, డీజిల్పై మైనస్ రూ. 23 గా ఉన్నాయని, గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్పై రూ.200 మేర నష్టం వస్తోందని వెల్లడించారు. భారత్ తన చమురు అవసరాలలో 88 శాతానికి పైగా దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఈ ఏప్రిల్ నుంచి జులై కాలంలో భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు 56 శాతం పెరిగి 63.4 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ 40.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ధరలు మరింత పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Post a Comment