గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది. భారత్కు చెందిన వెయిట్లిఫ్టర్ చానబమ్ రిషికాంత్ సింగ్ ఆదివారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఎడిషన్లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకు ముందు పారా-పవర్లిఫ్టర్ ఝండు కుమార్ ఇండియాకు తొలి కాంస్య పతకాన్ని సాధించిపెట్టిన విషయం తెలిసింది. మ్యాచ్ ప్రారంభంలో 28 ఏళ్ల రిషికాంత్ సింగ్ అద్భుతమైన ఫామ్ను కనబరిచాడు. స్నాచ్ విభాగంలో రిషికాంత్ తన మూడు ప్రయత్నాలను (116 కిలోలు, 119 కిలోలు, 121 కిలోలు) బరువులు ఎత్తి సక్సెస్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో 121 కిలోల బరువు ఎత్తిన రిషికాంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్నాచ్ రికార్డును కూడా నెలకొల్పాడు. స్నాచ్ రౌండ్ ముగిసేసరికి అతను మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మొహమ్మద్ అనిక్తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్ రౌండ్లో మొదటి ప్రయత్నంలో 143 కిలోల బరువును సునయాసంగా ఎత్తిన రిషికాంత్ సింగ్.. రెండో ప్రయత్నంలో 148 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పటి వరకూ మూడో స్థానంలో కొనసాగుతున్న మలేషియన్ వెయిట్ లిఫ్టర్ అనిక్ 149 కిలోలను ఎత్తి ఆధిక్యంలోకి వచ్చాడు. స్వర్ణం గెలుచుకోవడానికి, రిషికాంత్ తన చివరి ప్రయత్నంలో 151 కిలోలను ఎత్తాల్సి ఉండగా విఫలమయ్యాడు. రిషికాంత్ మొత్తం 264 కేజీలు (స్నాచ్ 121 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ 143 కిలోలు) ఎత్తి రజత పతకాన్ని గెలుచుకోగా.. మలేషియాకు చెందిన అనిక్ (273 కేజీలు) స్వర్ణం ఎగరేసుకుపోయాడు.
0 Comments