నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన టర్కీ
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సహా ఆయన ప్రభుత్వంలోని సీనియర్ అధికారులపై మారణహోమం సృష్టించారనే ఆరోపణలతో టర్కీ అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. గాజాలో ఇజ్రాయెల్ పద్ధతి ప్రకారం పాల్పడిన మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలపై టర్కీ చట్టపరమైన చర్యకు పూనుకుంది. ఇస్తాంబుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేసులో మొత్తం 37 మంది అనుమానితుల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్ గ్విర్, ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ వంటి కీలక అధికారులు ఉన్నట్లు పేర్కొంది. అయితే పూర్తి జాబితాను మాత్రం ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించలేదు. ఈ అరెస్ట్ వారెంట్ల జారీకి సంబంధించిన ఫిర్యాదులో.. గాజా స్ట్రిప్లో టర్కీ సర్కారు నిర్మించిన "టర్కిష్-పాలస్తీనియన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్" అంశాన్ని కూడా ప్రస్తావించింది. మానవతా సేవలకు అంకితమైన ఈ ఆసుపత్రిని ఇజ్రాయెల్ సైన్యం మార్చి నెలలో బాంబు దాడి చేసి ధ్వంసం చేసిందని ఫిర్యాదులో తెలిపింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని టర్కీ బలంగా వాదిస్తోంది. టర్కీ గతేడాది నుంచే ఇజ్రాయెల్పై చట్టపరమైన పోరాటం చేస్తూ వస్తోంది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం తర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్పై దాఖలు చేసిన మారణహోమం కేసులో టర్కీ కూడా చేరి, పాలస్తీనాకు తన మద్దతును అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపించింది. తాజా అరెస్ట్ వారెంట్లు అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ చట్టబద్ధతపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాంతీయ శాంతి ప్రణాళికలో భాగంగా.. గాజా భూభాగంలో అక్టోబర్ 10వ తేదీ నుంచి యుద్ధ విరమణ అమలు అవుతుంది. ఈ అరెస్ట్ వారెంట్ల జారీ.. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా రాజకీయాలపై, ఈ శాంతి ప్రయత్నాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నెతన్యాహు ప్రభుత్వం టర్కీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వారెంట్లు అంతర్జాతీయ చట్టాలను, ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమేనని పేర్కొంది.
Comments
Post a Comment