వచ్చే విద్యా సంవత్సరం నుంచి 'తల్లికి వందనం'
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థికంగా పేద కుటుంబాలకు పెద్ద రిలీఫ్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఈ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల విద్య కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం అమలు చేసే సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు పేద కుటుంబాల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పథకం ద్వారా పిల్లలకు విద్యా వృద్ధి పథకాలను పూర్తి చేయడం, విద్యా కృత్యాలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అలాగే గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలు స్థలాన్ని 100 పడకల ఈఎస్ఐసీ ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడులకు, విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడులకు అమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం రూ.1,046 కోట్ల పెట్టుబడులకు ఆమోదించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈనెల 8వ తేదీన ప్రధాని రాష్ట్రానికి రానున్న తరుణంలో ఈ పర్యటనపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ప్రధాని మోడీ విశాఖలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Comments
Post a Comment