ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం ?
న్యూఢిల్లీ లోని ఓల్డ్ రాజేంద్రనగర్లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బెస్మెంట్లో భారీ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి చెందిన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకు వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 30 సివిల్స్ కోచింగ్ సెంటర్ల బెస్మెంట్ను సీల్ చేశామని తెలిపారు. అలాగే 200 కోచింగ్ సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ షెల్లీ ఓబెరియ్తో కలసి మంత్రి అతిషి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అధికారులు, విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. డ్రైనేజ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అందువల్ల వరద నీరు బయటకు వెళ్ల మార్గం లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సైతం తన ప్రాథమిక నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని మంత్రి అతిషి వివరించారు. డ్రైనేజిలపై కోచింగ్ సెంటర్ల అక్రమ నిర్మాణం కారణంగా.. వరద నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీంతో ఆ ప్రాంతంలో డ్రైనేజీ మూసుకు పోయిందన్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలను నియంత్రించడంతో విఫలమైన జూనియర్ ఇంజినీర్ను ఉద్యోగ విధుల నుంచి శాశ్వతంగా తొలగించామని చెప్పారు. అలాగే అసిస్టెంట్ ఇంజినీర్పై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. గత మూడురోజులుగా వివిధ కోచింగ్ సెంటర్లలలో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ ద్వారా కూల్చివేస్తున్నట్లు వివరించారు. మరో ఆరు రోజుల్లో ఈ సంఘటనపై మేజిస్టేరియల్ నివేదిక అందనుందన్నారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అతిషి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు అదనపు కార్యదర్శి సారథ్యంలో ఉన్న స్థాయి కమిటీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని.. అయితే ఆ నివేదిక వచ్చే లోపే తమ ప్రభుత్వం కార్యచరణ చేపడుతుందని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ షెల్లీ ఒబేరాయ్ మాట్లాడుతూ ఆందోళన బాట పట్టిన సివిల్స్ విద్యార్థుల డిమాండ్లను తాము వింటామన్నారు. అందుకోసం త్వరలో వారితో సమావేశం కానున్నామని ప్రకటించారు. అనంతరం కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకు వస్తామని మేయర్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం భారీ వర్షాల కారణంగా.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు ప్రవేశించింది. ఈ నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment