బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం : రెండురోజుల పాటు తెలంగాణలో వర్షాలు
బం గాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం అకస్మాత్తుగా మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నిన్న రాత్రి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసిన నేపథ్యంలో సోమవారం కూడా నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు పడొచ్చని సూచించారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పరిస్థితులను బట్టి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు...