సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి, నమోదైన కేసును కొట్టివేయించాలి : రుచికా సింగ్ తల్లి ప్రధానికి విజ్ఞప్తి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సమయంలో నోయిడాకు చెందిన 15ఏళ్ల రుచికా సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు రుచికా సింగ్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ తనపై, తన తల్లిపై దుర్భాషలాడిన వారిని తాను క్షమిస్తున్నానని చెప్పారు. వారు దారితప్పిన పిల్లలని పేర్కొంటూ, వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడం సమాజం బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత రుచికా సింగ్ సైతం ఓ వీడియోను విడుదల చేశారు. "నాకు కేవలం 15 ఏళ్లే. నన్ను క్షమించండి. నేను చేసినది నా మొదటి, చివరి తప్పు" అని ఆమె పేర్కొంది. అలాగే తన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు కూడా క్షమాపణలు చెప్పింది. అయితే, తాజాగా ఈ ఘటనపై.. రుచికా సింగ్ తల్లి స్పందిస్తూ మోడీకి విజ్ఞప్తి చేశారు. రుచికా సింగ్ తల్లి మాట్లాడుతూ తన కుమార్తెను క్షమించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రధాని క్షమించడంతో నా కుమార్తెకు కొత్త జీవితం లభించింది. అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించినా, క్షమించి ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. ఇవాళ నా కుమార్తె పుట్టిన రోజు.. ఆమెకు ప్రధాని అత్యంత గొప్ప కానుకగా కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈరోజుకు ఆమెకు పునర్జన్మ లభించిందని భావోద్వేగానికి గురయ్యారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె విజ్ఞప్తి చేస్తూ మైనర్లను సోషల్ మీడియా వాడకుండా నిరసనల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని బాలిక తల్లి విజ్ఞప్తి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రుచికా సింగ్ వయస్సు 25 నమోదు కాగా, ఈ అంశంపై యువతి తల్లి స్పందిస్తూ.. నా కుమార్తె వయస్సు 15ఏళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. తన కుమార్తెపై నమోదైన కేసును కొట్టివేయించాలని ప్రధానిని కోరారు. నా బిడ్డ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయంపై అధికారులు జోక్యం చేసుకొని మాకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
Comments
Post a Comment