ఉద్యోగం కోసం దుబాయ్‌ వెళ్లిన యువతి హైదరాబాద్‌లోనే మాయమైంది !

హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు కనిపించకుండా పోయిందని భావించిన కుటుంబానికి, పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అదృశ్యం కాలేదని, నెలల క్రితమే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఆ తర్వాతే కనిపించకుండా పోయిందని పోలీసులు గుర్తించారు. టోలిచౌకికి చెందిన షాహిదా బేగం కుమార్తె అదీబా (24) 2025 ఆగస్టులో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లింది. కొంతకాలం తర్వాత ఆమెతో కుటుంబ సభ్యులకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మొదట టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, విదేశాలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లినందున కేసును ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసులకు బదిలీ చేశారు. ప్రయాణ వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు, అదీబా 2025 నవంబర్‌లోనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు గుర్తించారు. అయితే ఇంటికి వెళ్లకుండానే ఆమె అదృశ్యమైనట్లు తేలడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎవరినైనా కలిసిందా? స్వచ్ఛందంగా వెళ్లిందా? లేక మరో కారణం ఉందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. దుబాయ్‌లో అదృశ్యమైనట్లు వచ్చిన సమాచారం తప్పని, యువతి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిందని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. యువతి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం