ముంబైలో సీ-ఫేసింగ్ లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్టుమెంట్ ఖరీదు రూ. 703 కోట్లు
రియల్ ఎస్టేట్ రంగాన్ని విస్తుపోయేలా చేస్తూ దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస స్థలాల కొనుగోలు ఒప్పందం నమోదైంది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం యూఎస్వీ చైర్పర్సన్ లీనా గాంధీ తివారీ, ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు సీ-ఫేసింగ్ లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లను ఏకంగా 703 కోట్లకు కొనుగోలు చేశారు. ఇండియన్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒకే ఒక్క ప్రాపర్టీ కోసం ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇదే తొలిసారి. ఈ మైండ్ బ్లోయింగ్ డీల్లో చదరపు అడుగు ధర దాదాపు 3 లక్షలు పలుకడం రియల్ ఎస్టేట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాపర్టీల ధరకు సమానంగా ఈ రేటు ఉండటం, భారత్లో అల్ట్రా-రిచ్ వర్గాల్లో లగ్జరీ గృహాలకు ఉన్న విపరీతమైన డిమాండ్కు అద్దం పడుతోంది. సముద్రాన్ని తలపించే అద్భుతమైన వ్యూ , ప్రపంచస్థాయి హంగులు, అత్యాధునిక మౌలిక వసతులు, గరిష్టమైన ప్రైవసీని అందించేలా ఈ రెండు లగ్జరీ డ్యూప్లెక్స్ ఇళ్లను డిజైన్ చేశారు. ముంబై తీరప్రాంతంలోని అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ఆస్తి కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే పూర్తయింది. గతంలో కూడా ముంబైలోని మలబార్ హిల్స్, వర్లీ , బ్రాండ్ నార్త్ ప్రాంతాల్లో రూ. 200 కోట్ల నుంచి రూ. 500 కోట్ల మధ్య డీల్స్ జరిగినప్పటికీ.. లీనా గాంధీ తివారీ చేసిన ఈ 703 కోట్ల ఒప్పందం పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. భారత రియల్ ఎస్టేట్లో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది.
Comments
Post a Comment