E20 వివాదం : తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమైన నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా తాను, తన కుటుంబం లాభపడుతున్నారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు గడ్కరీకి సివిల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మీద మాత్రమే కాకుండా.. ఎక్స్, గూగుల్ వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు, పేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ వీడియోలు, మార్పింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం అవుతున్నాయి. వీటిలో ఈ20 ఇథనాల్ కార్యక్రమం వల్ల తనకు, తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నట్లు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని గడ్కరీ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా.. ఈ20 విధానం తన శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని రూపొందించడం, అమలు చేయడం లేదా నిర్వహించడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు పోస్టులను తొలగించాలని, వాటిని సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే.. బాంబే హైకోర్టు ప్రస్తుతం గడ్కరీకి కేసు దాఖలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టుల తొలగింపు వంటి తాత్కాలిక ఉపశమనాలపై తదుపరి దశలో విచారణ జరగనుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం