కర్ణాటకను తాము ఒక ఆరోగ్యకరమైన పోటీదారుగా చూస్తున్నాం : రైజింగ్ భారత్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు
బెంగళూరు వేదికగా జరుగుతున్న 'న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ 2026' సౌత్ ఎడిషన్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరానికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, స్పేస్ టెక్ హబ్గా ఉన్న గుర్తింపుపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. "ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణం కోసం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన సమయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ నేడు ఆ రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్లోని ఏ ప్రాంతానికైనా 40 నుంచి 50 నిమిషాల్లో చేరుకునే వెసులుబాటు లభించింది" అని ఆయన గుర్తుచేశారు. డిజిటల్ మౌలిక వసతులకు పెద్దపీట వేశామని, రాష్ట్రంలోని మూలమూలల ఉన్న పల్లెలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనుసంధానించామని వెల్లడించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకను తాము ఒక ఆరోగ్యకరమైన పోటీదారుగా చూస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి రాష్ట్రానికి తగినన్ని వనరులు ఉంటాయని వివరించారు. లభ్యమయ్యే భూమి, మానవ వనరులు, మౌలిక సదుపాయాలను పరిశీలించిన తర్వాతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
Comments
Post a Comment