మరో ఆస్పత్రికి తరలించాలని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా కోరుతూ గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. దీంతో శనివారం ఆయనను ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో, ఆస్పత్రిపై నమ్మకం లేదని, ఆయనను మరో ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చికిత్స నెపంతో ఆయనను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ తన నిరవధిక నిరాహార దీక్షలో 21వ రోజున ఉన్నప్పుడు అతడిని బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని గీతాంజలి పేర్కొన్నారు. గత 20 రోజులుగా అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, వైద్యుల నుండి అతడిని వేరు చేశారని ఆమె తెలిపారు. ప్రస్తుత నిర్బంధ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 19,21 ఉల్లంఘన అని ప్రకటించాలని, అతడిని ఆస్పత్రి నుంచి తక్షణమే విడుదల చేయాలని లేదా కుటుంబం ఎంపిక చేసిన ఆస్పత్రిలో చేర్పించేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. వాంగ్‌చుక్ భార్య ఆంగ్మో సోషల్ మీడియాలో ఆస్పత్రి యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పొటాషియం స్థాయి 2.9కి పడిపోయిందని, ఇది ప్రాణాపాయ స్థాయి అని ఆస్పత్రి కుటుంబానికి తెలియజేసిందని ఆమె అన్నారు. ఆయన హెల్త్ బులెటిన్‌లో మాత్రం కేవలం పొటాషియం లెవల్స్ పడిపోతున్నాయని మాత్రమే చెప్పారని అన్నారు. చాలా గంటలపాటు వేడుకున్న తర్వాత, రాత్రి సుమారు 10:30 గంటలకు ఒక స్వతంత్ర ప్రయోగశాలలో రక్త నమూనాని పరీక్ష చేయించుకోవడానికి తమ కుటుంబానికి అనుమతి లభించిందని, ఆ నివేదికలో పొటాషియం స్థాయి 3.5గా తేలిందని, ఇది సాధారణ పరిధిలోనే ఉందని సోనమ్ వాంగ్‌చుక్ భార్య పేర్కొన్నారు. దీని ఆధారంగా, ఆమె ఆసుపత్రి వైద్య నివేదికను ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి గానీ ఆసుపత్రి యాజమాన్యం నిరాకరిస్తోందని గీతాంజలి ఆరోపించారు. ఆస్పత్రి ఫ్లోర్‌లో 30 మంది పోలీసులు, ఆస్పత్రి అంతటా 100 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉన్నారని, కుటుంబ సభ్యుల కదలికల్ని నియంత్రిస్తున్నారని ఆమె తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం