వైఎస్ షర్మిలకు సర్జరీ విజయవంతం : హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోను షేర్ చేసిన షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్నిరోజులుగా పొత్తికడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు అబ్డామినల్ సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం శస్త్రచికిత్స విజయవంతమై తాను వేగంగా కోలుకుంటున్నట్లు ఆమె స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హాస్పిటల్ బెడ్పై ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు. ఇటీవల నాకు అవసరమైన ఉదర శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను, వేగంగా కోలుకుంటున్నాను అని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ సమయంలో నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి, నా కోసం ప్రార్థనలు చేసిన శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మరియు ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ ఆందోళనల సమయంలో షర్మిల ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల్లో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వైద్యుల సూచన మేరకు ఆమె ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటుండటం వల్లే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది.
Comments
Post a Comment