హార్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపారు : ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సిందే
విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపారని, వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారనే వార్తలు వస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కానీ అందుకు విరుద్ధంగా వారిపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్లు ప్రయోగించారని, బిహార్లో ఏకే-47తో కాల్పులు జరిగాయని రాహుల్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఢిల్లీ.. రాష్ట్రం ఏదైనా విద్యార్థుల గొంతు నొక్కివేయాలనే ధోరణే కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిజాయతీ లేనిదని తాను గతంలోనే చెప్పానని, నిజమైన సంస్కరణలు తీసుకురావడం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదని రాహుల్ విమర్శించారు. ఇచ్చిన హామీల నుంచి వెనక్కి తగ్గడంతో పాటు, విద్యార్థుల గొంతు అణచివేసేందుకు అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశ విద్యార్థులకు ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. విద్యార్థులపై చర్యలు తీసుకోవడం కాకుండా, వారిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగా, జూలై 25న బీహార్ బంద్ సందర్భంగా సివాన్ జిల్లాలో పోలీసులు ఏకే-47తో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ పోలీసు అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Comments
Post a Comment