భారీ లాభాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు : ఒక్కరోజే 9.7 లక్షల కోట్లు పెరిగిన సంపద

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలు చవిచూశాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మార్కెట్‌కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1695 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా అత్యధికంగా 461.30 పాయింట్లు పైకి ఎగసింది. ట్రేడింగ్ ఉదయం భారీ లాభాల్లో 74,709.27 పాయింట్ల వద్ద ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 75,608.02 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 1695.40 పాయింట్ల లాభంతో 75,527.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరకు 461.30 పాయింట్ల లాభంతో 23,622.90 పాయింట్ల వద్ద ముగిసింది. భారీ లాభాల కారణంగా స్టాక్ మార్కెట్ ఈ ఒక్కరోజే ఏకంగా రూ.9.7 లక్షల కోట్లు అర్జించింది. దీంతో భారత స్టాక్ మార్కెట్ విలువ రూ.452.33 లక్షల కోట్ల నుంచి రూ.462.05 లక్షల కోట్లకు పెరిగింది. సెన్సెక్స్ 20 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఇండిగో, ఎల్‌అండ్‌టీ, టైటాన్ షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. శుక్రవారం బ్రెంట్ బ్యారెల్ క్రూడాయిల్ ధర 86 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర కూడా తగ్గి, 4224 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.11గా ఉంది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం