11 కిలోల హైడ్రోపోనిక్ గంజాయితో పట్టుబడ్డ మోడల్ హర్ష సన్నీని

బ్యాంకాక్ నుంచి ముంబై చేరుకున్న మోడల్ హర్ష సన్నీ 11 కిలోల అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది. విమానాశ్రయంలో సాధారణ నిఘా నిర్వహిస్తున్న అధికారులకు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అడ్డుకున్నారు. కస్టమ్స్ అధికారుల సమాచారం ప్రకారం, జూన్ 10-11 రాత్రి బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానం TG-351 ద్వారా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హర్ష సన్నీ చేరుకుంది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్, కస్టమ్స్ విభాగానికి చెందిన అధికారులు ఆమెను ఆపి సోదా చేశారు. ఆమె వద్ద ఉన్న ట్రాలీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో వాక్యూమ్ ప్యాక్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ప్యాకెట్లలో "పచ్చటి పదార్థం" ఉండటాన్ని అధికారులు గమనించారు. వెంటనే ఎన్డీపీఎస్ కిట్ ద్వారా అక్కడికక్కడే చేసిన రసాయన పరీక్షల్లో, ఆ పదార్థం అత్యంత నాణ్యమైన 'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. నిషేధిత మత్తుపదార్థాలను స్మగ్లింగ్ చేసినందుకు గానూ హర్ష సన్నీని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేసింది. స్వాధీనం చేసుకున్న ఈ 'హైడ్రోపోనిక్ గంజాయి' బరువు 11 కిలోలకు పైగా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2025 'మిసెస్ కేరళ' పోటీల్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మాజీ మోడల్ హర్ష సన్నీని అధికారులు ఫోర్ట్ కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ భారీ డ్రగ్స్ రవాణా ఎవరికి అందజేయాల్సి ఉందనే కోణంలో అధికారులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం