ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు


న్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియకు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ ప్రక్రియ ఎన్నికల పారదర్శకతను, విశ్వసనీయతను బలోపేతం చేయడానికేనని, ప్రజాప్రతినిధుల చట్టానికి మరింత జీవం పోస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జోయ్‌మాలా బగ్చి, విపుల్ ఎం పంచోలితో కలిసి ఈ తీర్పు వెలువరించింది. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో చేపట్టిన SIR ప్రక్రియ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తీర్పు వెలువరిస్తూ కోర్టు నాలుగు ప్రధాన అంశాలను పరిశీలించినట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్‌కు ఈ తరహా సవరణ చేపట్టే అధికారం ఉందా? ఈ ప్రక్రియ చట్టపరంగా సముచితమా? ప్రజాప్రతినిధుల చట్టం-1950కు విరుద్ధమా? ఓటరు జాబితాల్లో చేర్పు కోసం పౌరసత్వాన్ని పరిశీలించే హక్కు కమిషన్‌కు ఉందా? వంటి అంశాలపై ధర్మాసనం పరిశీలన జరిపింది. చివరకు ఎన్నికల కమిషన్ చర్యలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని పేర్కొంది. ఓటరు జాబితాల్లో ఖచ్చితత్వం, సంపూర్ణత, విశ్వసనీయతను కాపాడడమే ఈ చర్యల లక్ష్యమని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు అతిగా లేవని, అవి యాదృచ్ఛికంగా కూడా కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓటర్ల పేర్లు అన్యాయంగా తొలగించబడకుండా తగిన రక్షణ చర్యలు కూడా అమల్లో ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్లు SIR ప్రక్రియను "ఎన్‌ఆర్‌సీ తరహా చర్య"గా అభివర్ణించారు. ముఖ్యంగా బిహార్‌లో సుమారు 65 లక్షల పేర్లు డ్రాఫ్ట్ ఓటరు జాబితా నుంచి తొలగించడాన్ని వారు ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు పౌరసత్వ నిర్ధారణ చేసే అధికారం లేదని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని వాదించారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం