ఇరాన్-అమెరికా చర్చలు విఫలం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలం కాలేదు. రెండు దేశాల మధ్య శనివారం సాయంత్రం నుంచి సాగుతున్న చర్చల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు విఫలమైనట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. తమ బృందం చర్చలను మధ్యలోనే వదిలేసి.. అమెరికా వెళ్లిపోతున్నట్లు మీడియాకు వివరించారు. చర్చల తర్వాత బయటికి వచ్చిన జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 21 గంటల పాటు ఇరాన్తో తాము చర్చలు జరిపినట్లు తెలిపారు. చాలా కీలక విషయాలపై రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు చర్చించినట్లు పేర్కొన్నారు. కానీ ఈ సుదీర్ఘ చర్చల్లో రెండు వైపులా ఎవరూ తగ్గకపోవడంతో.. ఎలాంటి ఒప్పందం చేసుకోలేకపోయామని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరేందుకు తాము కొన్ని షరతులు విధించామని.. అయితే ఇరాన్ మాత్రం వాటికి ఒప్పుకోలేదని జేడీ వాన్స్ చెప్పారు. ఈ శాంతి చర్చల్లో అమెరికా ప్రతినిధులు చాలా సానుకూలంగా వ్యవహరించినట్లు చెప్పుకొచ్చారు. యుద్ధాన్ని ముగించి ఒప్పందం కుదుర్చుకోవాలనే మంచి ఉద్దేశంతో తాము పాకిస్తాన్కు వచ్చామని.. శాంతి ఒప్పందం చేసుకునేందుకు తమ వంతు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసినట్లు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ శాంతి ఒప్పందం కుదరకపోవడం అమెరికా కంటే.. ఇరాన్కే బ్యాడ్ న్యూస్ అని అభివర్ణించారు. పాకిస్తాన్లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే తాము తిరిగి అమెరికాకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇరాన్ కూడా స్పందించింది. హర్మూజ్ జలసంధి పూర్తి పట్టు ఇరాన్కే ఉండాలి. ఇరాన్ అణు హక్కులు వంటి ముఖ్యమైన అంశాలపై అమెరికా విధిస్తున్న డిమాండ్లు.. వాటికి తాము ఒప్పుకోకపోవడం కారణంగానే చర్చలు ఎటూ తేలకుండా ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
Comments
Post a Comment