అమరావతి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదు - అది ఒక ముగియని కథ : అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగాన్
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మాజీ మంత్రి విడదల రజని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ అమరావతి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదని, అది ఒక ముగియని కథ అని అన్నారు. రాజధాని అభివృద్ధికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చెబుతున్నారని, అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుందని అన్నారు. "అమరావతి ఎప్పటికీ పూర్తయ్యే పథకం కాదు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా వర్షం వస్తే నిండిపోయే చెరువులాంటి గుంతలో రాజధానిని కడతారా?" అని ప్రశ్నించారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (మావిగాన్) కారిడార్ను అంబటి ప్రతిపాదించారు. కేవలం రూ. 20 వేల కోట్లతో ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. అమరావతి కేవలం 217 చదరపు కిలోమీటర్లకే పరిమితమని, కానీ మావిగన్ ప్రాంతం 60 లక్షల జనాభాతో ఇప్పటికే అభివృద్ధి చెంది ఉందని వివరించారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై స్పందిస్తూ.. "రాజధాని పరిరక్షణకు చట్టం తెచ్చామని చెబుతున్నారు. రేపు మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని మార్చలేరా?" అని అంబటి వ్యాఖ్యానించారు. రాజధానిపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావుడిని తప్పుబట్టారు.
Comments
Post a Comment