అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ లొంగిపోయే ప్రసక్తే లేదు !
లెబనీస్ ఉద్యమం శత్రువుల ముందు మోకరిల్లదని, మడమ తిప్పకుండా పోరాడుతుందని హిజ్బుల్లా చీఫ్ షేక్ నయీమ్ ఖాసిం స్పష్టం చేశారు. యుద్ధం ఎంత భీకరంగా ఉన్నా, తమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గబోమని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో నయీమ్ ఖాసిం లెబనాన్ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించారు. లెబనాన్ ఇప్పుడు ఓ చారిత్రాత్మక మలుపులో నిలబడి ఉందని, దేశం ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొదటిది భూమిని, ఆత్మగౌరవాన్ని, రాబోయే తరాల భవిష్యత్తును శత్రువుకు ధారపోసి బానిసలుగా లొంగిపోవడం, రెండోది కష్టనష్టాలకు ఓర్చి శత్రువును వీరోచితంగా ఎదుర్కోవడమని ఆయన స్పష్టం చేశారు. తాము రెండో మార్గాన్నే ఎంచుకున్నామని, గౌరవం లేని జీవితం కంటే పోరాటమే మిన్న అని ఆయన అన్నారు. ఈ యుద్దం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.. ఇది తమ ఉనికి, ప్రాంతీయ సమగ్రతకు సంబంధించిన మనుగడ పోరాటమని ఆయన అభివర్ణించారు. ఇజ్రాయెల్, దాని మిత్రదేశాల వ్యూహాలను హిజ్బుల్లా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని నయీమ్ ఖాసిం తెలిపారు. తమ పోరాట పటిమ కారణంగానే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో భారీ అడుగు వేయలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. తమ సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు, దేశభక్తి దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. కేవలం యుద్ధ వీరులనే కాకుండా.. ఈ దాడుల వల్ల ఇళ్లు కోల్పోయి రోడ్డున పడినా.. దేశం కోసం దృఢంగా నిలబడుతున్న సాధారణ ప్రజల సహనాన్ని, త్యాగాన్ని కూడా హిజ్బుల్లా చీప్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Post a Comment