వ్యక్తిగత దురలవాట్ల వల్ల కలిగే వ్యాధులకు వైకల్య పెన్షన్ ఇవ్వడం సాధ్యంకాదు : సుప్రీంకోర్టు తీర్పు
వ్యక్తిగత దురలవాట్ల వల్ల కలిగే వ్యాధులకు వైకల్య పెన్షన్ ఇవ్వడం సాధ్యంకాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పక్షవాతం కారణంగా తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఒక మాజీ సైనికుడు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ అరవింద్ కుమార్,జస్టిస్ బి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మద్యం సేవించడం, పొగాకు లేదా మాదకద్రవ్యాల వాడకం వంటి వ్యక్తిగత దురలవాట్ల వల్ల కలిగే వ్యాధులను సైనిక విధుల్లో సంభవించిన అనారోగ్యాలుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. సదరు మాజీ సైనికుడికి మెదడులోని రక్త ధమనుల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల పక్షవాతం వచ్చిందని వైద్య నివేదికలు పేర్కొన్నాయి. బాధితుడిని పరీక్షించిన వైద్య బృందం, అతను రోజుకు సుమారు పది బీడీలు తాగే అలవాటు ఉన్నట్లు గుర్తించింది. ఈ మితిమీరిన ధూమపానం వల్లే అతనికి పక్షవాతం వచ్చిందని, ఇది సైనిక విధుల వల్ల లేదా పని వాతావరణం వల్ల సంభవించినది కాదని వైద్య నివేదికలో స్పష్టమైంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, సదరు సైనికుడికి పెన్షన్ నిరాకరిస్తూ 'ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్' గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ మరియు ధూమపానం వంటివి మెదడుకు రక్తప్రసరణను అడ్డుకుని పక్షవాతానికి దారితీస్తాయని వైద్య నిపుణులు కోర్టుకు వివరించారు.
Comments
Post a Comment